ఇండియాలో రెట్టింపు అమ్మకాలే లక్ష్యం :డ్యుకాటి

ఇటలీకు చెందిన ప్రముఖ లగ్జరీ బైక్‌ల తయారీ సంస్థ 'డ్యుకాటి' భారత మార్కెట్లో విక్రయాలను రెండింతలకు పెంచుకోవాలని లక్ష్యంగా నిర్ధేశించుకున్నట్లు ప్రకటించింది. భారత్‌లో ప్రిమీయం వాహనాలకు డిమాండు పెరుగుతుండటంతో ఈ ఏడాది తమ మోటార్‌సైకిళ్ల అమ్మకాలు భారీగా పెరిగే అవకాశం ఉందని కంపెనీ అంచనా వేస్తుంది. దేశీయ మార్కెట్లో ఈ ఏడాది 200 డ్యుకాటి మోటార్‌సైకిళ్లను అమ్మాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు కంపెనీ ఆసియా పసిఫిక్ ఛీఫ్ ఎగ్జిక్యూటివ్ మిర్కో బోర్డిగా తెలిపారు. 2010లో డ్యుకాటి భారత్‌లో 100 ప్రిమీయం మోటార్‌సైకిళ్లను విక్రయించింది.భారత మార్కెట్లో అధిక డిమాండ్ ఉందని, కొత్త మోటార్‌సైకిల్ తయారీదారుల భారత్‌కు రావడంతో మార్కెట్ మరింత వృద్ధి చెందిందని బోర్డిగా తెలిపారు.
ఇప్పుడప్పుడే భారత్‌లో అసెంబ్లింగ్ ప్లాంటు ఏర్పాటు చేసే ఆలోచన లేదని ఆయన అన్నారు. భారత మార్కెట్లో ఇప్పటికే హ్యార్లీ డేవిడ్‌సన్, సుజుకి మోటార్ కార్ప్, కవాసకి, యమహా మోటార్, బిఎమ్‌డబ్ల్యూ వంటి కంపెనీలు ప్రిమీయం బైక్‌లను అందిస్తున్న సంగతి తెలిసిందే. వీటికి తోడు తాజాగా బ్రిటన్‌కు చెందిన మరో కొత్త కంపెనీ ట్రైయంప్ కూడా దేశీయ మార్కెట్లోకి అడుగుపెట్టేందుకు ఆసక్తి చూపుతున్న సంగతి తెలిసిందే.2008లో డ్యుకాటి భారత్‌లో విక్రయాలను ప్రారంభించింది. ప్రస్తుతం 15 మోడళ్ల హై-పెర్ఫామెన్స్ మోటార్‌సైకిళ్లను దేశీయ మార్కెట్లో అందిస్తోంది. వాటిల్లో సూపర్‌బైక్ 1098ఆర్ మరియు హైపర్‌మోటార్డ్ 1100ఎస్ వంటి మోడళ్లు కూడా ఉన్నాయి. కంపెనీ ఇటీవలే మరో లగ్జరీ బైక్ డయావెల్‌ను కూడా విడుదల చేసింది.

లాగిన్