ప్రెంచ్ దేశానికి చెందిన ప్రపంచపు రెండో అతి పెద్ద కార్ల తయూరీ సంస్థ పీఎస్ఏ ప్యూజో సిట్రాన్ తిరిగి భారత్ మార్కెట్ లోకి ప్రవేశించనున్నట్లు గతంలో ప్రకటించిన సంగతి తెలిసిందే.ఇది గత పదేళ్ల క్రితమే భారత ఆటోమొబైల్ మార్కెట్ నుంచి వైదొలగినది.అయితే, సంస్థ కేవలం తమ ఉత్పత్తులను ఇక్కడి మార్కెట్లో ప్రవేశపెట్టడమే కాకుండా.. భారత్లోనే స్వతాహాగా వాటిని ఉత్పత్తి చేయాలని భావిస్తోంది.
భారతదేశంలోని ఏ ప్రాంతంలో ప్లాంటు ఏర్పాటు చేస్తే లబ్ధిదాయకంగా ఉంటుదనే అంశంపై కంపెనీ మార్కెట్ అధ్యయనం చేస్తుంది. ఇప్పటికే, ఆంధ్రప్రదేశ్, గుజరాత్ మరియు తమిళనాడు ప్రాంతాలలో స్థాలాల కోసం కంపెనీ అన్వేషిస్తుండగా, తాజాగా వచ్చే వారం తమిళనాడు ప్రభుత్వంతో కంపెనీ ఉన్నతాధికారుల బృందం భేటీ కానుంది.గతంలో తమిళనాడులో ప్లాంటు ఏర్పాటు చేయాలని కంపెనీ భావించినప్పటికీ, అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో, కరుణానిధి ప్రభుత్వంతో తమ రాయబారాన్ని కంపెనీ విరమించుకుంది.
ప్రస్తుతం తమిళనాడులో కొత్త ప్రభుత్వం ఏర్పడటంతో, ప్యూజో చర్చలకు సిద్ధమైంది. తమిళనాడు ఇప్పటికే ఆటోమొబైల్ హబ్గా ఎదుగుతుండటం, అన్ని రకాల రవాణా సదుపాయాలను కలిగి ఉండటంతో ప్యూజో వీలైనంత వరకూ ఆ రాష్ట్రంలోనే ప్లాంటును ఏర్పాటు చేసే అవకాశాలు ఉన్నాయి. అయితే, ఇది ప్యూజో కంపెనీకు జయలలిత ప్రభుత్వం ప్రకటించే రాయితీలపై ఆధారపడి ఉంటుంది. ఈ నేపథ్యంలో తమిళనాడు ప్రభుత్వంతో ప్యూజో ఉన్నతాధికారుల భేటీ ప్రాధాన్యం సంతరించుకోనుంది.
ఫోక్స్వ్యాగన్ గ్రూపుకు చెందిన భారతీయ అనుబంధ సంస్థ ఆడి ఇండియా గత నెల విక్రయాలలో రెండితల వృద్ధిని సాధించి శభాష్ అనిపించుకుంది. మే 2011లో ఆడి విక్రయాలు 104 శాతం వృద్ధి చెంది 408 వాహనాలను విక్రయించింది. గతేడాది ఇదే సమయంలో కంపెనీ విక్రయాలు కేవలం 200 యూనిట్లుగా మాత్రమే ఉన్నట్లు కంపెనీ పేర్కొంది. అలాగే జనవరి-మే 2011 కాలానికి మొత్తం విక్రయాలు కూడా రెండింతలు పెరిగాయి. ఈ కాలానికి ఆడి ఇండియా మొత్తం విక్రయాలు 1,167 యూనిట్ల నుంచి 2,394 యూనిట్లకు పెరిగాయి. ఓ వైపు ఇంధన ధరలు, వడ్డీ రేట్లు పెరుగుతున్నప్పటికీ కంపెనీ పటిష్ట వృద్ధిని సాధించిందని, తమ డీలర్ భాగస్వాములు మరియు నిజాయితీ గల వినియోగదారుల మద్దతుతో 2011 ఆడి ఇండియా ఓ అనిర్వచనీయమై సంవత్సరంగా మిగిలిపోతుందని కంపెనీ హెడ్ మైఖేల్ ప్రెష్కీ తెలిపారు.
భారతీయులలో పెరుగుతున్నటువంటి అభిరుచికి అనుగుణంగా లగ్జరీ కార్ల పై మోజు పెరుగుతుండడంతో వాటి యొక్క వినియోగం ఎక్కువయ్యింది. దీనితో లగ్జరీ కార్ల అమ్మకాలు పెరిగినాయి . గతంలో భారతదేశంలో రెండు-మూడు లగ్జరీ కార్ల కంపెనీలు మాత్రమే ఉంటే ఇప్పుడు నెలకో కంపెనీ చొప్పున భారత్లో తమ దుకాణాలు పెట్టేస్తున్నాయి. పోటీ పోటీగా మోడళ్లను దింపుతూ చౌక ధరలకే వాహనాలను అందిస్తున్నాయి. అయితే ఇంతటి పోటీతత్వ మార్కెట్లో కూడా కొన్ని కంపెనీలు తమ బ్రాండే గ్రేట్ అనిపించుకుంటున్నాయి. అలాంటి బ్రాండ్లలో ఆడి కూడా ఒకటి.